TDP: డీఎస్సీ నియామకాలపై వైసీపీ ఆరోపణలు నిరాధారం.. మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు!

TDP: 2025 డీఎస్సీ ద్వారా చేపట్టిన ఉపాధ్యాయ నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయని, వాటిపై ఇప్పుడు వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ విమర్శించారు.

Published : 2026-06-04 20:48:00

మెరిట్ ఆధారంగా జరిగిన నియామకాలను తప్పుబట్టడం సరికాదు..

డీఎస్సీపై 9 నెలల తర్వాత వైసీపీ చేస్తున్న విమర్శలు ఆశ్చర్యకరం..

మంగళగిరి: 2025 డీఎస్సీ ద్వారా చేపట్టిన ఉపాధ్యాయ నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయని, వాటిపై ఇప్పుడు వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ విమర్శించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 148 రోజుల్లోనే 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తూ డీఎస్సీ నిర్వహించిందని ఆయన గుర్తుచేశారు. ఎంపికైన అభ్యర్థులు ఇప్పటికే పాఠశాలల్లో విధులు నిర్వహిస్తూ విద్యార్థులకు బోధన చేస్తున్నారని చెప్పారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత అక్రమాలు జరిగాయని ఆరోపించడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు.

ఉపాధ్యాయ నియామకాల్లో మెరిట్‌కు ప్రాధాన్యం కల్పించే విధానాన్ని స్వర్గీయ ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు బలోపేతం చేశాయని రామకృష్ణ తెలిపారు. గతంలో రాజకీయ సిఫార్సులతో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులను తొలగించి, పరీక్షలు, మెరిట్ ఆధారంగా నియామకాలు జరిగేలా వ్యవస్థను తీసుకువచ్చారని చెప్పారు.

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఉపాధ్యాయ నియామకాల విషయంలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆయన ఆరోపించారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పినా ఆ దిశగా చర్యలు కనిపించలేదన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో కూడా అప్పటి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

స్పోర్ట్స్ కోటా కింద జరిగిన నియామకాలపై వస్తున్న విమర్శలను ఖండిస్తూ, "బ్రిడ్జ్" అనేది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన క్రీడ అని ఆయన వివరించారు. 2018 ఆసియా క్రీడల్లో కూడా ఈ క్రీడకు స్థానం లభించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గుర్తింపు పొందిన క్రీడల జాబితాలో ఇది ఉందని, నిబంధనల ప్రకారమే క్రీడా కోటా కింద నియామకాలు జరిగాయని స్పష్టం చేశారు.

మొత్తం పోస్టుల్లో మూడు శాతం క్రీడా రిజర్వేషన్ కింద వందలాది మంది అభ్యర్థులకు ఉద్యోగాలు లభించాయని పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకారుల అర్హతలు, సర్టిఫికెట్లను సంబంధిత అధికారులు పూర్తిగా పరిశీలించిన తర్వాతే నియామకాలు చేపట్టారని చెప్పారు.

డీఎస్సీ నియామకాలను అడ్డుకునేందుకు గతంలో వైసీపీ అనేక న్యాయపరమైన అభ్యంతరాలు, కేసులు వేసిందని రామకృష్ణ ఆరోపించారు. అయినప్పటికీ ప్రభుత్వం పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేసి ఉద్యోగ నియామకాలు చేపట్టిందన్నారు.

2003 డీఎస్సీ అభ్యర్థుల అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అప్పట్లో నియామకాల ఆలస్యం కారణంగా అనేక మంది ఉపాధ్యాయులు సీపీఎస్ పరిధిలోకి వెళ్లారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వారికి ఓపీఎస్ ప్రయోజనాలు కల్పించే నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు.

కోవిడ్ సమయంలో ఉపాధ్యాయులను ఇతర పనులకు వినియోగించడం, వారి వృత్తిపరమైన గౌరవాన్ని దెబ్బతీసే పరిస్థితులు గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్నాయని విమర్శించారు. ఉపాధ్యాయులు, నిరుద్యోగుల భావోద్వేగాలతో రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు.

డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల ప్రతిభను, పరీక్షల నిర్వహణలో భాగమైన విద్యాశాఖ అధికారులను, పరీక్షా నిర్వహణ సంస్థలను కించపరచడం తగదని రామకృష్ణ సూచించారు. పారదర్శకంగా పూర్తైన నియామకాలను రద్దు చేయడం సాధ్యం కాదని, ఈ అంశంపై అనవసర రాజకీయాలు మానుకోవాలని వైసీపీ నాయకులకు సూచించారు.

రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Spotlight

Read More →