విశాఖపట్నంలో గూగుల్ AI హబ్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక రంగం మరో పెద్ద అడుగు వేసింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో స్పందించారు. సోషల్ మీడియా వేదిక X (ట్విటర్)లో ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. “VIZA‘G’లోని ‘G’ అంటే ఇక నుంచి ‘గూగుల్’ అని చెప్పొచ్చు. ఇది యంగెస్ట్ స్టేట్ హై ఇన్వెస్ట్మెంట్ గమ్యస్థానం అవుతుందనడానికి ఇది ఒక బలమైన సంకేతం” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆయన తన ట్వీట్లో “#GoogleInVizag #YoungestStateHighInvestment” అనే హాష్ట్యాగ్లను కూడా ఉపయోగించారు.
గూగుల్ డేటా సెంటర్, AI రీసెర్చ్ హబ్, హైపర్ స్కేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి కీలక ప్రాజెక్టులను విశాఖలో స్థాపించబోతున్నట్లు సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ రంగం ఉత్సాహంలో మునిగిపోయింది. ఇది కేవలం ఒక పెట్టుబడి ఒప్పందం మాత్రమే కాకుండా, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, ఉపాధి అవకాశాలకు, ప్రపంచ ఐటీ మ్యాప్లో ఏపీకి కొత్త గుర్తింపుని తెచ్చిపెట్టే ఘట్టమని సీఎం తెలిపారు.
విశాఖపట్నం భౌగోళికంగా, సాంకేతికంగా, వాతావరణ పరంగా కూడా గూగుల్ వంటి గ్లోబల్ కంపెనీలకు అనుకూలమైన కేంద్రంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, పారదర్శక విధానాలు, డిజిటల్ మౌలిక వసతులు ఇవన్నీ కలసి ఇలాంటి మల్టీనేషనల్ సంస్థలను ఆకర్షిస్తున్నాయని చెప్పారు.
గూగుల్ ప్రాజెక్ట్ పూర్తయితే కనీసం 10,000 మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు అంచనా. అదేవిధంగా, ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర డిజిటల్ ఎకోసిస్టంను బలోపేతం చేస్తుందని టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఒప్పందం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా హర్షం వ్యక్తం చేశారు. “విశాఖలో గూగుల్ AI హబ్ భారత్ డిజిటల్ శక్తికి ప్రతీక” అని పేర్కొన్నారు. దీనిపై స్పందిస్తూ చంద్రబాబు, “ప్రధానితో కలిసి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ఫ్యూచర్ను నిర్మించడం పట్ల గర్వంగా ఉంది” అన్నారు.
ఇలా ఒకవైపు గూగుల్ ప్రాజెక్ట్ రాష్ట్ర భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తుండగా, మరోవైపు సీఎం చంద్రబాబు సాంకేతికతపైన చూపుతున్న స్పెషల్ ఫోకస్ మళ్లీ ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఆయన ట్వీట్లోని “Vizag’ G = Google” లైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్లు “సీఎం లెవెల్ ట్వీట్!” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.