ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విద్యారంగానికి పెద్ద పీట వేస్తోంది. రాష్ట్రాన్ని అన్ని విధాలా సుసంపన్నం చేయడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వం, ముఖ్యంగా విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఆంధ్రప్రదేశ్లో రెండు ముఖ్యమైన యూనివర్సిటీలను (Universities) ప్రారంభించబోతోంది.
ఈ ఏడాది నుండి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాలలో (Open University) ప్రవేశాలను (Admissions) ప్రారంభించనున్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తమ సేవలను నిలిపివేసిన ఈ రెండు యూనివర్సిటీలు తిరిగి సేవలు అందించడానికి కసరత్తు జరుగుతోంది.
ఈ రెండు యూనివర్సిటీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఏర్పడ్డాయి. అయితే, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం, విభజన తర్వాత పదేళ్లు పూర్తి కావడంతో, ఏపీలో ఈ యూనివర్సిటీలు తమ సేవలను నిలిపివేశాయి. దీనివల్ల గతంలో చాలా మంది విద్యార్థులకు అవకాశాలు తగ్గాయి.
రాజమహేంద్రవరంలో కొత్తగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ యూనివర్సిటీ ఇప్పటికే శ్రీశైలం, కూచిపూడి, రాజమహేంద్రవరంలలో తన కార్యకలాపాలను విస్తరించి ఉంది. ఏలూరు జిల్లాలో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి ఈ యూనివర్సిటీని తాత్కాలికంగా ఏర్పాటు చేసి, ఈ ఏడాది నుంచే ప్రవేశాలను నిర్వహించనున్నారు.
ఈ యూనివర్సిటీలను త్వరితగతిన ప్రారంభించడానికి ప్రభుత్వం ముఖ్యమైన నియామకాలపై దృష్టి పెట్టింది. తెలుగు యూనివర్సిటీకి మునిరత్నం నాయుడు, అంబేద్కర్ యూనివర్సిటీకి ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ విజయ భాస్కర్లను ప్రత్యేకాధికారులుగా నియమించే ఫైలుపై ప్రభుత్వం ప్రస్తుతం పరిశీలనలో ఉంది.
హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం 22 విభాగాలు, 40 కోర్సులు ఉన్నాయి. వీటిని ఇక్కడ ప్రారంభించడానికి 72 బోధనా (Teaching), 115 బోధనేతర (Non-Teaching) పోస్టులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. మొదటగా ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్సులను ప్రారంభించాలని చూస్తున్నారు.
తెలుగు విశ్వవిద్యాలయం తన కార్యకలాపాలను పూర్తి స్థాయిలో ప్రారంభించడానికి నిధుల కేటాయింపుపై కూడా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ రాజమహేంద్రవరంలో కార్యకలాపాలు నిర్వహించడానికి అక్కడి భవనాలను ఆధునీకరిస్తున్నారు.
ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి సుమారు రూ. 50 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రతిపాదనలు చేస్తున్నారు. ఇందులో ప్రారంభ బడ్జెట్ రూ. 20 కోట్లు కాగా, జీతభత్యాలకు, అలాగే మౌలిక సదుపాయాల కల్పనకు మరో రూ. 30 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు.
గత సంవత్సరం ప్రవేశాలు లేకపోవడంతో, ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మాత్రమే యూనివర్సిటీలో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ప్రవేశాలు ప్రారంభించడం వల్ల వేలాది మంది విద్యార్థులకు సాంస్కృతిక, సార్వత్రిక విద్యను అభ్యసించడానికి మెరుగైన అవకాశాలు లభించినట్లవుతుంది.