వ్యవసాయం అంటే కేవలం శ్రమ మాత్రమే కాదు, సరైన ప్రణాళికతో మార్కెట్ అవసరాలను గుర్తిస్తే అది బంగారు గని అని గుజరాత్లోని భావ్నగర్ రైతులు నిరూపిస్తున్నారు. సాంప్రదాయ పత్తి, వేరుశనగ పంటలకే పరిమితం కాకుండా, మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఇప్పుడు వారు ‘అమెరికన్ స్వీట్ కార్న్’ (మొక్కజొన్న) వైపు అడుగులు వేస్తున్నారు. కేవలం రుచిలో మాత్రమే కాదు, రాబడిలోనూ ఇది ఎంతో తియ్యనైనదని రైతుల అనుభవాలు చెబుతున్నాయి. గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే, ఈ ప్రాంతంలో అమెరికన్ మొక్కజొన్న సాగు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించడం విశేషం.
నాటు మొక్కజొన్నతో పోలిస్తే అమెరికన్ స్వీట్ కార్న్ రకానికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. భావ్నగర్ జిల్లాలోని అంధరివాడ, ఘోగ్హా ప్రాంత రైతులు 2008 నుంచే ఈ పంటను పండిస్తున్నప్పటికీ, గడిచిన ఐదేళ్లలో దీని సాగు వైశాల్యం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా 2024-25 ఏడాదిలో రికార్డు స్థాయిలో 898 హెక్టార్లలో ఈ పంట సాగు జరిగింది. మార్కెట్లో ఈ మొక్కజొన్న కిలోకు రూ. 20 నుంచి రూ. 25 వరకు పలుకుతోంది. కేవలం ధాన్యం రూపంలోనే కాకుండా, పంట పూర్తయిన తర్వాత మిగిలే మొక్కలను పశువుల మేతగా ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల రైతులకు అదనపు ఖర్చు తగ్గుతూ, ఆదాయం పెరుగుతోంది. ఒక్కో బిఘాకు (సుమారు 62 సెంట్లు) దాదాపు రూ. 70 వేల నుంచి రూ. 80 వేల వరకు నికర ఆదాయం లభిస్తోందని రైతులు ధీమాగా చెబుతున్నారు.
లాభాలు ఎంత ఎక్కువగా ఉన్నాయో, ఈ పంటకు ‘ఫాల్ ఆర్మీవార్మ్’ అనే ప్రమాదకరమైన తెగులు ముప్పు కూడా అంతే స్థాయిలో పొంచి ఉంది. నాలుగు మచ్చలతో ఉండే ఈ పురుగులు పంటను తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఈ విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని భావ్నగర్ జిల్లా వ్యవసాయ అధికారి ఎమ్. రిజ్వాన్ సూచిస్తున్నారు. పంటకు వ్యాధి రాకముందే వేప నూనెను పిచికారీ చేయడం, అవసరమైన రసాయన ఎరువులను సరైన సమయంలో వాడటం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని ఆయన తెలిపారు. కాజావదర్ బెల్ట్ వంటి ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు.
అకాల వర్షాలు, మంచు కురవడం పురుగుల దాడుల నుంచి పంటను కాపాడుకోవడానికి ప్రభుత్వం ‘ఎకో ఫ్రెండ్లీ నెట్ హౌస్’ పద్ధతిని ప్రోత్సహిస్తోంది. ఈ విధానాన్ని అనుసరించే రైతులకు ప్రభుత్వం 65 శాతం వరకు భారీ సబ్సిడీని అందిస్తోంది. ఈ నెట్ హౌస్ల వాడకం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు, పంట నాణ్యత కూడా పెరుగుతోంది. తద్వారా మార్కెట్లో మంచి ధర లభించడమే కాకుండా, ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటకు రక్షణ దొరుకుతోంది.
ప్రస్తుతం భావ్నగర్ రైతులు అవలంబిస్తున్న ఈ నూతన వ్యవసాయ పోకడలు దేశంలోని ఇతర ప్రాంతాల రైతులకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయి. స్వీట్ కార్న్తో పాటు స్ట్రాబెర్రీ సాగు, ఇటాలియన్ తేనెటీగల పెంపకం వంటి కొత్త ప్రయోగాలు చేస్తూ అక్కడి అన్నదాతలు ఆర్థికంగా బలోపేతమవుతున్నారు.