
దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఉపాధ్యాయులుగా కొనసాగాలన్నా, ప్రమోషన్లు పొందాలన్నా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) తప్పనిసరి అని తేల్చి చెప్పింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత లేకుండా ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగడం చట్టబద్ధం కాదని స్పష్టంగా పేర్కొంది. కనీసం ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసిన టీచర్లు అయినా, TET పాస్ చేయకపోతే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది.
తాజాగా ఉపాధ్యాయ అర్హతపై పలు రాష్ట్రాల నుండి వచ్చిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఇందులో, కొంతమంది ఉపాధ్యాయులు 2012కు ముందే ఉద్యోగంలో చేరారని, ఆ సమయంలో TET నిబంధన లేకపోవడంతో తామిని మినహాయించాలని వాదించారు. అయితే సుప్రీంకోర్టు ఈ వాదనను తిరస్కరించింది. “TET పరీక్షను అర్హత ప్రమాణంగా ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలంటే, ఉపాధ్యాయులకూ కనీస విద్యార్హత, నైపుణ్యం ఉండాలి. కాబట్టి ఎవరికీ మినహాయింపు ఇవ్వడం సాధ్యం కాదు” అని తీర్పులో పేర్కొంది.
కోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర విద్యా శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. “ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్న, కానీ TET పాస్ కాని ఉపాధ్యాయులు రెండేళ్లలోపు పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాలి. ఈ గడువు తర్వాత కూడా పాస్ కాకపోతే, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు వారి నియామకాలను రద్దు చేయాలి” అని తెలిపింది.
ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా లక్షలాది ఉపాధ్యాయులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2012లోనే తొలిసారి TET నిర్వహించబడింది. ఆ సమయానికి ముందే నియమితులైన 30 వేలమంది టీచర్లు ఈ తీర్పుతో ప్రభావితమవుతారు. వీరంతా ఇప్పుడు TET పాస్ చేయకపోతే ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు.
TET పరీక్షను కేంద్ర ప్రభుత్వం 2011లో ప్రవేశపెట్టింది. ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాన్ని అంచనా వేసే ఉద్దేశ్యంతో ఈ పరీక్షను తప్పనిసరి చేసింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ఉపాధ్యాయ నియామకాలకు ప్రాథమిక అర్హతగా పరిగణిస్తారు. విద్యార్థుల బోధన ప్రమాణాలు మెరుగుపడాలంటే, ఉపాధ్యాయులకూ నిర్దిష్ట ప్రమాణాలు ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు.
సుప్రీంకోర్టు తీర్పుతో విద్యాశాఖల్లో చర్చలు మొదలయ్యాయి. “ఇప్పటికే సేవలో ఉన్నవారికి TET రాయడం కష్టమవుతుంది” అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నాణ్యమైన విద్యను అందించడంలో ఈ నిర్ణయం అవసరమని మరికొందరు విశ్లేషకులు అంటున్నారు. ఈ తీర్పుతో ఉపాధ్యాయ వృత్తిలో అర్హత, బాధ్యత, నైపుణ్యం అన్నవి ప్రధానమైన గా పరిగణిస్తున్నారు.