దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త బ్యాంకింగ్ లావాదేవీలను మరింత సరళతరం చేస్తూ, నవంబర్ 1వ తేదీ నుంచి కీలకమైన బ్యాంకింగ్ చట్టాల (సవరణ) చట్టం, 2025 అమల్లోకి రానుంది. ముఖ్యంగా నామినేషన్ ప్రక్రియ, లాకర్ల వినియోగం విషయంలో వచ్చిన ఈ కొత్త మార్పులు కస్టమర్లు ఎదుర్కొనే ఇబ్బందులను, క్లెయిమ్ల ఆలస్యాన్ని గణనీయంగా తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.
కొత్త చట్టం ప్రకారం ఇకపై ఒకే డిపాజిట్ ఖాతాకు నలుగురు వ్యక్తుల వరకు నామినీలను నియమించుకునే వెసులుబాటు లభించింది. గతంలో ఒక డిపాజిట్ ఖాతాకు ఒకరిని మాత్రమే నామినీగా పెట్టే వీలుండేది. అయితే ఈ కొత్త నిబంధనతో ఖాతాదారులు ఒకేసారి నలుగురిని నామినేట్ చేయవచ్చు లేదా ఒక్కొక్కరిని వారసత్వ క్రమంలో (Sequential Order) కూడా పెట్టవచ్చు.
ఈ కీలక మార్పు కారణంగా ఖాతాదారుడికి ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైతే, డిపాజిట్ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ చాలా త్వరగా పూర్తవుతుందని బ్యాంకింగ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
డిపాజిట్లతో పాటు, లాకర్లు (Lockers), సేఫ్ కస్టడీ వస్తువుల (Safe Custody Articles) విషయంలోనూ ఇదే బహుళ నామినీ నియమం వర్తిస్తుంది. ఖాతాదారు తన లాకర్లో ఉన్న వస్తువులను ఎవరికి ఎంత శాతం ఇవ్వాలనుకుంటున్నాడో ముందుగానే బ్యాంకుకు తెలియజేయవచ్చు.
దీనివల్ల భవిష్యత్తులో లాకర్ క్లెయిమ్లపై వారసుల మధ్య తగాదాలు లేకుండా సులభంగా పరిష్కారం లభిస్తుంది. క్లెయిమ్ ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుంది.
కొత్త చట్టంలో ఉమ్మడి ఖాతాదారులకు (Joint Account Holders) సైతం ప్రత్యేక అవకాశం కల్పించారు. జాయింట్ ఖాతాలు ఉన్నవారు ఇద్దరూ అంగీకరించి, తమ నామినీల వివరాలను ఎప్పుడైనా మార్చుకోవచ్చు లేదా కొత్తవారిని చేర్చుకోవచ్చు. ఇక నుంచి ఈ వివరాలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో (ఆన్లైన్లో) అప్డేట్ చేయాల్సి ఉంటుంది.
పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ 'బ్యాంకింగ్ చట్టాల (సవరణ) చట్టం, 2025' అమలులోకి వచ్చిన తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థలో కస్టమర్ల హక్కులు మరింత బలపడతాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద లాకర్, నామినీ, డిపాజిట్ క్లెయిమ్లపై స్పష్టమైన విధానం ఉండడం వల్ల సామాన్య కస్టమర్లకు ఈ కొత్త మార్పులు నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.