హర్దోయి జిల్లాలో 594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్ప్రెస్వే..
ఉత్తరప్రదేశ్లోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్వే..
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. ప్రధాని నరేంద్ర మోదీ హర్దోయి జిల్లాలో 594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్ప్రెస్వేను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ, గంగా నది వేల ఏళ్లుగా ఉత్తరప్రదేశ్కు జీవనాడిగా ఉన్నట్టే, ఈ ఎక్స్ప్రెస్వే కూడా రాష్ట్ర అభివృద్ధికి కొత్త జీవనాడిగా మారుతుందని ప్రధాని పేర్కొన్నారు.
ఈ హై-స్పీడ్ కారిడార్ రాష్ట్రంలోని పశ్చిమ, మధ్య, తూర్పు ప్రాంతాలను ఒకే మార్గంలో కలుపుతూ కీలక పాత్ర పోషించనుంది. ఉత్తరప్రదేశ్లోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్వేగా ఇది నిలవనుంది. మీరట్ నుంచి ప్రయాగ్రాజ్ వరకు ప్రస్తుతం సుమారు 12 గంటలు పడుతున్న ప్రయాణ సమయం, ఈ ఎక్స్ప్రెస్వే ద్వారా కేవలం 6 గంటలకు తగ్గనుంది.
ఈ ఎక్స్ప్రెస్వే మీరట్, హాపూర్, బులంద్షహర్, అమ్రోహా, సంభల్, బుదౌన్, షాజహాన్పూర్, హర్దోయి, ఉన్నావ్, రాయ్బరేలీ, ప్రతాప్గఢ్, ప్రయాగ్రాజ్ జిల్లాల గుండా వెళ్తుంది. దీని వల్ల అనేక ప్రాంతాల మధ్య కనెక్టివిటీ మెరుగవుతుందని అధికారులు తెలిపారు.
ప్రత్యేకంగా షాజహాన్పూర్ ప్రాంతంలో 3.5 కిలోమీటర్ల పొడవైన ఎయిర్స్ట్రిప్ను కూడా ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో భారత వాయుసేన విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ చేసుకునేలా ఇది ఉపయోగపడనుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా పరిశ్రమలు, వాణిజ్యం, వ్యవసాయం, పర్యాటక రంగాలకు భారీగా ప్రోత్సాహం లభించనుంది. అంతేకాకుండా, ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగ అవకాశాలు కూడా సృష్టించబడతాయని ప్రభుత్వం భావిస్తోంది.
మొత్తంగా గంగా ఎక్స్ప్రెస్వే ఉత్తరప్రదేశ్ అభివృద్ధి దిశలో ఒక పెద్ద మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.