Yaganti Temple: ప్రముఖ శైవ పుణ్యక్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయ రూపురేఖలు మార్చేందుకు కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. భక్తుల సౌకర్యార్థం సుమారు రూ. 5.08 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆయన ఆవిష్కరించారు.
భక్తుల కోసం అత్యాధునిక వసతులు
యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిధులతో ఆలయ పరిధిలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచనున్నారు. ఇందులో భాగంగా రూ. 3.30 కోట్ల వ్యయంతో 16 గదులు, రెండు పెద్ద డార్మిటరీలు, 8 వాణిజ్య షాపుల నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేశారు. అలాగే భక్తులకు నాణ్యమైన భోజనం అందించేందుకు రూ. 1.25 కోట్లతో నిత్య అన్నదాన సత్రాన్ని, రూ. 29 లక్షలతో ఆధునిక లడ్డూ తయారీ కేంద్రం (పోటు)ను నిర్మించనున్నారు. ఎండ, వానల నుంచి భక్తులకు రక్షణగా రూ. 24 లక్షలతో క్యూలైన్ షెడ్లను కూడా ఏర్పాటు చేయనున్నారు.
గత ప్రభుత్వంపై మంత్రి నిప్పులు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత మూడేళ్లలో (2021-24) ఆలయానికి రూ. 7 కోట్ల ఆదాయం వచ్చినా, ఆ నిధులు ఎటు పోయాయో లెక్కల్లేవని ఆయన ఆరోపించారు. కానీ, తమ ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలోనే (2025 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు) రూ. 5.57 కోట్ల ఆదాయం రాగా, ఆ సొమ్మును భక్తుల సౌకర్యాల కోసమే ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. దేవుడి సొమ్మును దుర్వినియోగం చేసిన వారు భగవంతుడికి సమాధానం చెప్పుకోక తప్పదని హెచ్చరించారు.
అభివృద్ధిని అడ్డుకోవడం దుర్మార్గం
ఆలయానికి వచ్చే భక్తుల వాహనాల కోసం 10 ఎకరాల్లో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేస్తుంటే, దానిపై కూడా వైసీపీ నేతలు కోర్టులో పిటిషన్లు వేసి అడ్డుకోవడం దారుణమని మంత్రి మండిపడ్డారు. అటవీ భూములను ఆక్రమిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలకు మంచి పనులు చేస్తుంటే విమర్శించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. అధికారులను బెదిరించడం మానుకోవాలని, నిజంగా సేవ చేయాలనే తపన ఉంటే సొంత నిధులతో ప్రజలకు సాయం చేయాలని ఆయన సూచించారు.
రాజకీయాలకు తావులేని ఆధ్యాత్మిక కేంద్రం
యాగంటి క్షేత్రంలో తాము ఎప్పుడూ ఆధిపత్యం కోసం ప్రయత్నించలేదని, కేవలం భక్తుల సేవకే ప్రాధాన్యత ఇస్తామని మంత్రి బీసీ తెలిపారు. దేవాలయం వంటి పవిత్ర స్థలాల్లో రాజకీయాలు చేయడం తమకు ఇష్టం లేదని, కేవలం అభివృద్ధిపైనే తమ దృష్టి ఉంటుందని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన ఈ నిర్మాణ పనులన్నీ పూర్తి చేసి, అతి త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.