AP Roads Construction: రాజకీయ నాయకులు వెళ్లాలంటేనే భయపడే మారుమూల గిరిజన ప్రాంతాల్లో పర్యటించి, అక్కడి ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలోని నందిగరువు గ్రామంలో శనివారం ఆయన పర్యటించారు. కేవలం 40 ఇళ్లు మాత్రమే ఉన్న ఈ చిన్న గ్రామానికి స్వయంగా విచ్చేసిన పవన్, గిరిజనులతో కలిసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, వారిలో ఒకరిగా కలిసిపోయి భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల తర్వాత ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించడం గర్వంగా ఉందన్నారు. కేవలం 40 గడపలు ఉన్న ఈ గ్రామానికి సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో బిటి రోడ్డు నిర్మించామని తెలిపారు. గతంలో గర్భిణీలు, రోగులు ఆసుపత్రికి వెళ్లాలంటే డోలీల మీద మోసుకెళ్లే దుస్థితి ఉండేదని, ఆ కష్టాలు చూడలేకే కేంద్ర ప్రభుత్వ సహకారంతో అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ రోడ్లు వేయించినట్లు వివరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇకపై డోలీ మోతలు కనిపించకూడదన్నదే తమ కూటమి ప్రభుత్వ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభలు పెట్టుకోవచ్చని, కానీ తనకు ఆడంబరాల కంటే ప్రజల క్షేమమే ముఖ్యమని పవన్ అన్నారు. అందుకే లక్షలాది మంది మధ్య కాకుండా, ఇలాంటి మారుమూల గ్రామంలోని అడవి బిడ్డల మధ్య వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే గిరిజన ప్రాంతాల్లో దాదాపు 460 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం పూర్తి చేశామని, రాబోయే రోజుల్లో మిగిలిన మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు.
వైసీపీ పాలనపై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఐదేళ్లలో ఇక్కడి నుండి గెలిచిన ఎమ్మెల్యే ఒక్కసారి కూడా ఈ గ్రామానికి వచ్చి మీ కష్టాలు వినలేదని విమర్శించారు. వైసీపీ హయాంలో కేవలం నిధుల మళ్లింపు జరిగిందే తప్ప, గిరిజన గ్రామాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలకు రావడానికి నాయకులు భయపడతారని, కానీ ప్రజల కోసం ప్రాణాలకు తెగించి ఎక్కడికైనా వెళ్తానని పవన్ ధైర్యంగా ప్రకటించారు. తమ ప్రభుత్వం ఓట్లు వేశారా లేదా అని చూడదని, కేవలం ప్రజల సంక్షేమమే ప్రాతిపదికన పనిచేస్తుందని గుర్తు చేశారు.
గిరిజన హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. "మీ కన్నీరు మీ గడప తొక్కకుండా చూడటమే మా లక్ష్యం" అంటూ గిరిజనులకు భరోసా ఇచ్చారు. రోడ్లతో పాటు తాగునీటి సౌకర్యం, పాఠశాల భవనాల నిర్మాణం వంటి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. తమది 'పీపుల్స్ ఫ్రెండ్లీ' ప్రభుత్వమని, ప్రజల కష్టాలు తీర్చడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఆయన పునరుద్ఘాటించారు. స్థానిక గిరిజనులు తమ సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లగా, వాటిని వెంటనే పరిష్కరించాలని అక్కడే ఉన్న అధికారులను ఆయన ఆదేశించారు.