పాలకొల్లులో రూ. 4.90 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని నేలపాలు చేసిన దుర్మార్గుడు జగన్..
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు కొత్త ఊపు తీసుకొచ్చారు. రూ. 4.90 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడిన మంత్రి, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్ల ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రోజుకు సుమారు 5 లక్షల మందికి కేవలం రూ.5కే భోజనం అందిస్తున్నారని తెలిపారు. పేదల ఆకలి తీర్చడంలో ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతోందని చెప్పారు.
ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల తీవ్ర విమర్శలు చేశారు. గతంలో అన్నా క్యాంటీన్లను నిలిపివేయడం వల్ల పేదలు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. కాశి అన్నపూర్ణ లాంటి భోజనాన్ని రోడ్డుపై పారపోసిన జగన్కు రాజకీయాల్లో ఉండే అర్హత లేదని, పేదవాడి నోటి కాడ కూడు లాక్కున్న గొడ్డలి పార్టీ రాష్ట్రానికి ఏం చేస్తుంది అని, దాతలు ముందుకు వచ్చి భోజనం అందించాలనుకున్నప్పటికీ, వారిపై కేసులు పెట్టి వేధించారని విమర్శించారు.
“అన్నం పరబ్రహ్మ స్వరూపం. అలాంటి అన్నాన్ని వృథా చేయడం చాలా తప్పు” అని మంత్రి పేర్కొన్నారు. పేదవాడి కడుపు నింపే కార్యక్రమాలను ఆపడం మానవత్వానికి విరుద్ధమని అన్నారు. ఐదేళ్ల పాటు పేదల కోసం సరైన చర్యలు తీసుకోలేదని కూడా విమర్శించారు.
అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. పాలకొల్లులో ప్రారంభించిన ఈ పనులు ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.