AP Civil Supplies Department: గత కొద్ది రోజులుగా గ్యాస్ సిలిండర్ల కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పౌరసరఫరాల శాఖ ఒక తీపి కబురు అందించింది. రాష్ట్రంలో సిలిండర్ల డెలివరీ ప్రక్రియ ఇప్పుడు మునుపటి కంటే వేగవంతమైందని అధికారులు ప్రకటించారు. బుకింగ్ చేసుకున్న తర్వాత డెలివరీకి మధ్య ఉన్న సమయం క్రమంగా తగ్గుతూ వస్తోంది. గత రెండు రోజులుగా బుకింగ్ల కంటే డెలివరీలే ఎక్కువగా జరుగుతుండటం గమనార్హం.
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయంగా గ్యాస్ సరఫరాలో కొన్ని ఆటంకాలు ఏర్పడ్డాయి. దీని ప్రభావం మన రాష్ట్రంపై కూడా పడటంతో మార్చి నెలలో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మార్చి రెండో వారంలో ఒక్కో రోజుకు దాదాపు 5 లక్షల వరకు బుకింగ్లు ఉండటంతో బ్యాక్లాగ్ పెరిగిపోయింది. అయితే, ప్రభుత్వం తీసుకున్న చొరవతో ప్రస్తుతం పరిస్థితి చక్కబడుతోంది. ప్రజలు గ్యాస్ కొరత గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాజా గణాంకాలను పరిశీలిస్తే, ఏప్రిల్ 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 2,11,302 మంది కొత్తగా గ్యాస్ బుక్ చేసుకోగా, ఏకంగా 2,77,367 సిలిండర్లను పంపిణీ చేశారు. అలాగే ఏప్రిల్ 5 (ఆదివారం) నాడు కూడా 2.25 లక్షల బుకింగ్లకు గాను, సుమారు 2.92 లక్షల డెలివరీలు జరిగాయి. ఇందులో పాత బాకీలు (బ్యాక్లాగ్) కూడా కలిసి ఉన్నాయి. అంటే, బుకింగ్ అయిన కొత్త సిలిండర్లతో పాటు పెండింగ్లో ఉన్న పాత ఆర్డర్లను కూడా గ్యాస్ ఏజెన్సీలు వేగంగా క్లియర్ చేస్తున్నాయి.
గ్యాస్ సరఫరా పెరగడానికి ప్రధాన కారణం విశాఖపట్నం పోర్టుకు భారీగా చేరుతున్న గ్యాస్ నౌకలే. రష్యా, ఇరాక్, ఖతార్ వంటి దేశాల నుంచి వరుసగా నౌకలు విశాఖ తీరానికి చేరుకుంటున్నాయి. గత నెలలో 24 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్తో వచ్చిన 'బీడబ్ల్యూ బ్రిచ్' నౌకతో పాటు, ఈ నెల 2, 5 తేదీల్లో మరికొన్ని నౌకలు చమురు, గ్యాస్ను అన్లోడ్ చేశాయి. దేశంలోని ముంద్రా పోర్టు నుంచి కూడా గ్యాస్ నిల్వలు రాష్ట్రానికి తరలివస్తున్నాయి.
గ్యాస్ కోసం వారాల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఇకపై ఉండదని తెలుస్తోంది. గ్యాస్ కంపెనీలు తమ సరఫరా నెట్వర్క్ను మరింత పటిష్టం చేయడంతో పాటు, రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం వల్ల సామాన్య ప్రజలకు ఊరట లభించినట్లయింది. పోర్టుల నుంచి గ్యాస్ నిల్వలు బాట్లింగ్ ప్లాంట్లకు, అక్కడి నుంచి ఏజెన్సీలకు నిరంతరం చేరుతుండటంతో రానున్న రోజుల్లో పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి రానుంది.