Education: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కోచింగ్ సెంటర్ల కోసం తీసుకువచ్చిన కొత్త నిబంధనలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ప్రైవేట్ కోచింగ్ సంస్థల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేస్తూ, విద్యార్థులపై పెరుగుతున్న విపరీతమైన ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా ఈ రూల్స్ రూపొందించారు. ఇకపై ఏ కోచింగ్ సెంటర్ అయినా సరే ఇష్టమొచ్చినట్లు తరగతులు నిర్వహించడానికి వీల్లేదు. ప్రతి సంస్థ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, పాత సెంటర్లు కూడా మూడు నెలల లోపు తమ వివరాలను నమోదు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా అనుమతి లేకుండా కోచింగ్ సెంటర్లు నడిపితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా భారీ జరిమానాలు కూడా విధిస్తారు.
విద్యార్థుల మానసిక ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించనుంది. రోజంతా క్లాసులతో కుస్తీ పడుతున్న పిల్లలకు ఉపశమనం కలిగించేలా, కోచింగ్ సమయాన్ని రోజుకు కేవలం ఐదు గంటలకే పరిమితం చేశారు. అంతకంటే ఎక్కువ సేపు క్లాసులు చెబితే అది నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుంది. అంతేకాకుండా ప్రతి ఆదివారం ఖచ్చితంగా సెలవు ఇవ్వాలని ఆదేశించారు. సెలవు రోజుల్లో కూడా స్పెషల్ క్లాసుల పేరుతో విద్యార్థులను పిలిపిస్తే సదరు సంస్థల లైసెన్సులు రద్దు చేసే అవకాశం ఉండనుంది. విద్యార్థులు చదువుతో పాటు కాస్త ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
కోచింగ్ సెంటర్ల భవనాలు అక్కడ ఉండే వసతులపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. తాత్కాలిక షెడ్లలో లేదా సరైన గాలి, వెలుతురు లేని గదుల్లో కోచింగ్ సెంటర్లు నడపకూడదని తేల్చి చెప్పింది. ముఖ్యంగా హాస్టల్స్ అపార్ట్మెంట్లలో ఉండే సెంటర్లలో విద్యార్థుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి. దురదృష్టవశాత్తూ జరిగే ఆత్మహత్యలను నివారించడానికి గదుల్లో 'స్ప్రింగ్ ఫ్యాన్లు' ఏర్పాటు చేయాలని, బాల్కనీలు టెర్రస్ల వద్ద రక్షణ గోడలు ఉండాలని ఆదేశించింది. ప్రతి సెంటర్లోనూ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చేలా ఒక వెల్నెస్ సెంటర్ ఉండటం ఇకపై తప్పనిసరి.
ఫీజుల విషయంలో కూడా మధ్యతరగతి తల్లిదండ్రులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా కోచింగ్ సెంటర్లు ముందే భారీగా ఫీజులు వసూలు చేస్తాయి, కానీ ఒకవేళ విద్యార్థికి అక్కడ నచ్చక మధ్యలోనే కోర్సు మానేయాలని అనుకుంటే, మిగిలిన కాలానికి సంబంధించిన ఫీజును సదరు సంస్థ తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. ఫీజుల వివరాలను, అక్కడ పనిచేసే ఫ్యాకల్టీ వివరాలను ప్రతి సంస్థ తమ వెబ్సైట్లో బహిరంగంగా ఉంచాలని, పారదర్శకత పాటించాలని సూచించింది.
ఈ నిబంధనల అమలును పర్యవేక్షించడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ పనిచేస్తుంది. ఈ కమిటీకి ఎప్పుడైనా ఏ కోచింగ్ సెంటర్నైనా తనిఖీ చేసే అధికారం ఉంటుంది. నిబంధనలు పాటించని వారికి మొదటిసారి 50 వేలు, రెండోసారి లక్ష రూపాయల జరిమానా విధిస్తారు. మూడోసారి కూడా తప్పు చేస్తే ఏకంగా రిజిస్ట్రేషన్ రద్దు చేసి సెంటర్ను మూసివేస్తారు. ప్రభుత్వ పాఠశాలలు లేదా కాలేజీల్లో పనిచేసే టీచర్లు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో పాఠాలు చెప్పకూడదని కూడా నిబంధనల్లో పేర్కొన్నారు. ఈ మార్పుల వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గి, ఒక క్రమపద్ధతిలో విద్యాబోధన జరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.