అనంతపురంలో వైఎస్ కుటుంబంపై విప్ కాల్వ ఘాటు విమర్శలు..
వైఎస్ కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..
అనంతపురంలో ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ కుటుంబానికి ఆరు దశాబ్దాల రక్త చరిత్ర ఉందని, మూడు తరాలుగా నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న కుటుంబమని ఆరోపించారు.
మీడియాతో మాట్లాడిన కాల్వ శ్రీనివాస్, “నేను పుట్టక ముందే రాజారెడ్డిపై రౌడీషీట్ ఉండేది. సెటిల్మెంట్లు, దౌర్జన్యాలు చేస్తున్నాడనే కారణాలతోనే పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు” అని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి నుంచే ఈ నేర చరిత్ర ప్రారంభమైందని విమర్శించారు.
వైఎస్ కుటుంబం చేయని నేరం లేదంటే అతిశయోక్తి కాదని ఆయన వ్యాఖ్యానించారు. “భారత చట్టాలకు సవరణలు చేసినా, వైఎస్ కుటుంబం చేసిన నేరాలకు పడే శిక్ష తక్కువే అవుతుంది” అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.
రాజకీయాల్లో హింసను మొదట ప్రవేశపెట్టింది వైఎస్ రాజారెడ్డేనని కాల్వ శ్రీనివాస్ ఆరోపించారు. ఆర్థిక అవసరాల కోసం ఆయన విచ్చలవిడిగా నేరాలకు పాల్పడ్డాడని, హత్యలు, దొమ్మీలు, దోపిడీలు చేసిన వ్యక్తినే జగన్ మంచి నాయకుడిగా చూపిస్తున్నారని విమర్శించారు.
అలాగే రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డికి పోలీసులపై దాడి చేసిన చరిత్ర కూడా ఉందని పేర్కొన్నారు. పులివెందుల నుంచి హైదరాబాద్ వరకు వైఎస్ కుటుంబం తమ నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకుందని ఆరోపించారు.
కాల్వ శ్రీనివాస్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మరోసారి మాటల యుద్ధానికి తెరలేచిన పరిస్థితి కనిపిస్తోంది.