పోలీసుల తీరుపై హిందు సంఘాల ఆగ్రహం..
తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా భూమన వ్యాఖ్యలు..
తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమన తీరుపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగాయి. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా భూమన వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయన ఇంటిని ముట్టడించేందుకు హిందూ సంఘాల నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో శిల్పారామం ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
భూమన వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని హిందూ సంఘాల నేతలు మండిపడ్డారు. వెంటనే హిందువులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే భూమనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు.
భూమన ఇంటి వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన హిందూ సంఘాల కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత మరింత పెరిగింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను ఎందుకు అడ్డుకుంటున్నారని హిందూ సంఘాల నేతలు పోలీసులను నిలదీశారు. పోలీసుల తీరుపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
“తిరుమల పవిత్రతను కాపాడటం ప్రతి హిందువు బాధ్యత. అలాంటి పవిత్ర స్థలంపై అవమానకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం” అంటూ పలువురు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమన వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించి నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం శిల్పారామం పరిసర ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు కొనసాగుతోంది.