శ్రమకు గుర్తింపు... శ్రామికులకు భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం..
నైపుణ్య శిక్షణతో కార్మికుల జీవితాల్లో కొత్త వెలుగు..
అమరావతి: రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికుల సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకుని కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న శ్రామికుల జీవితాల్లో భద్రత, గౌరవం, ఆర్థిక రక్షణ కల్పించాలనే లక్ష్యంతో కార్మిక శాఖ ద్వారా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతతో కార్మిక సంక్షేమం, పారిశ్రామిక భద్రత, ఆరోగ్య సేవలు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం ముందుకెళ్తోంది.
గత ప్రభుత్వ హయాంలో ఇసుక విధాన సమస్యలు, నిధుల దారి మళ్లింపుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నిర్మాణ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టింది. కార్మికులను కేవలం ఓటర్లుగా కాకుండా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుగా చూడాలనే ఉద్దేశంతో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది.
రోజువారీ కూలి కోసం రోడ్ల పక్కన ఎండలో, వానలో నిలబడే కార్మికుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆధునిక “ఇంటిగ్రేటెడ్ లేబర్ అమెనిటీస్ సెంటర్స్” ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు వంటి ప్రధాన నగరాలతో పాటు ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో లేబర్ అడ్డాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.
ఈ కేంద్రాల్లో స్వచ్ఛమైన తాగునీరు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులతో పాటు ఉద్యోగ సమాచారం, ప్రభుత్వ పథకాల వివరాలు కూడా అందించనున్నారు. పని లేని సమయాల్లో కార్మికులకు స్కిల్ ట్రైనింగ్ అందించి వారి నైపుణ్యాలను పెంచేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది.
రాష్ట్రంలో నమోదైన 88 లక్షల అసంఘటిత కార్మికుల్లో 18 లక్షల మందికి పైగా భవన నిర్మాణ కార్మికులే ఉన్నారు. గత ఐదేళ్లుగా నిలిచిపోయిన సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. కార్మిక కుటుంబాలకు ప్రసూతి సహాయం కింద రూ.20 వేలు, వివాహ కానుకగా రూ.40 వేలు అందిస్తోంది.
అదే విధంగా ప్రమాదవశాత్తు లేదా సహజ మరణం సంభవించినప్పుడు రూ.20 వేల సహాయం, అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.60 వేలు అందిస్తోంది. ఉచిత వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తోంది. ఈ చర్యలు కార్మిక కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.
“సేఫ్టీ ఫస్ట్” నినాదంతో ఫ్యాక్టరీల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. జులై 2024లో ప్రత్యేక భద్రతా తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన 23 ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకుంది. ప్రమాదాల నివారణ కోసం సేఫ్టీ అలర్ట్, ఇన్సిడెంట్ అలర్ట్ వంటి వినూత్న కార్యక్రమాలు ప్రారంభించింది.
ప్రమాదకర రసాయన కర్మాగారాల పర్యవేక్షణ కోసం కెమికల్ ఇన్స్పెక్టర్ల పోస్టుల సృష్టికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జేఎన్టీయూ, ఎస్వీయూ వంటి విశ్వవిద్యాలయాలతో కలిసి 360 పరిశ్రమల్లో థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్లు, మాక్ డ్రిల్స్ నిర్వహించడం ద్వారా ఏపీ పారిశ్రామిక భద్రతలో దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది.
ఈఎస్ఐ ఆస్పత్రుల ఆధునీకరణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. అచ్యుతాపురంలో కొత్త ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, తిరుపతి ఆస్పత్రి పడకల సామర్థ్యాన్ని 100కు పెంచారు. గుంటూరు, కర్నూలు, శ్రీసిటీ, నెల్లూరు ప్రాంతాల్లో కొత్త ఆస్పత్రుల కోసం భూములు కేటాయించారు. విశాఖపట్నంలో 50 సీట్ల ESIC మెడికల్ కాలేజీ మంజూరు కావడం, అమరావతిలో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం వంటి చర్యలు భవిష్యత్ వైద్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్నవిగా భావిస్తున్నారు.
ఇప్పటికే ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న శస్త్రచికిత్స సామగ్రి కొనుగోళ్లను రూ.78 లక్షలతో పునరుద్ధరించారు. “మై హెల్త్”, “ఈ-ఔషది” వంటి మొబైల్ యాప్ల ద్వారా ఔషధాల పంపిణీలో పారదర్శకత తీసుకొచ్చారు. కార్మికుల శ్రమకు గౌరవం, వారి కుటుంబాలకు భరోసా, ఆరోగ్యానికి రక్షణ కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన కొనసాగుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.