- కమాండ్ కంట్రోల్ సెంటర్తో భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు..
- Devotional: నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 94,758 మందికి స్వామివారి దర్శనం..
TTD UPdates: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి క్షేత్రం భక్తులతో పోటెత్తుతోంది. వేసవి సెలవులు కావడంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 94,758 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ మే నెలలో ఒకే రోజు దర్శనానికి వచ్చిన వారి సంఖ్య 90 వేలు దాటడం ఇది నాలుగోసారి కావడం విశేషం.
సాధారణంగా శుక్రవారం రోజున స్వామివారికి అభిషేకం, ఇతర ప్రత్యేక పూజా కైంకర్యాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో భక్తుల దర్శనానికి కేటాయించే సమయం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఉదయం జరిగే అభిషేక సేవ సమయంలో కూడా క్యూ లైన్లను నిలిపివేయకుండా సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించింది. ఈ నిర్ణయం వల్ల అదనంగా దాదాపు 5,850 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగలిగారని, మొత్తం 17 గంటలకు పైగా దర్శన సమయం కేటాయించామని టీటీడీ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి, క్యూ లైన్లు వెలుపలికి విస్తరించాయి. దీంతో, భక్తులు క్యూ లైన్లలోకి రావద్దని, రద్దీని నియంత్రించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. తీవ్రమైన ఎండలు ఉన్నప్పటికీ, వాటిని సైతం లెక్కచేయకుండా భక్తులు తిరుమలకు పోటెత్తడం గమనార్హం.
భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు టీటీడీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ టెక్నాలజీని వినియోగిస్తోంది. నడక మార్గాలు, ఘాట్ రోడ్ల ద్వారా బస్సులు, ప్రైవేటు వాహనాల్లో వస్తున్న భక్తుల సంఖ్యను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, కంపార్ట్మెంట్ల వద్ద రద్దీని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నారు.