- ఎయిర్ ఇండియా ప్రతిపాదనను పరిశీలిస్తున్న డీజీసీఏ..
- మధ్యప్రాచ్య ఉద్రిక్తతల వల్ల విమానాల దారి మళ్లింపు ప్రధాన కారణం..
Air India: మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ విమానయాన సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ ఉద్రిక్తతల దృష్ట్యా ఇరాన్, ఇరాక్ వంటి దేశాల గగనతలాన్ని ఉపయోగించకుండా విమానాలను దారి మళ్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా, తన పైలట్ల విమాన విధి నిర్వహణ సమయ పరిమితి (FDTL) నిబంధనల నుంచి తాత్కాలిక సడలింపు ఇవ్వాలని కోరుతూ విమానయాన నియంత్రణ సంస్థ డిజిసిఎ (DGCA) ను ఆశ్రయించింది. కొన్ని సుదూర మార్గాల విమానాలను ముగ్గురు పైలట్లకు బదులుగా ఇద్దరితోనే నడపడానికి అనుమతించాలని, అలాగే ప్రస్తుతం ఉన్న 10 గంటల గరిష్ఠ ప్రయాణ సమయాన్ని మరో గంటకు పైగా పెంచి 11.5 గంటల వరకు పొడిగించాలని అభ్యర్థించింది. అదనంగా, గరిష్ఠ ఫ్లైట్ డ్యూటీ పీరియడ్ను కూడా 13 గంటల నుంచి 14 గంటల 45 నిమిషాలకు పెంచాలని ఎయిర్ ఇండియా తన ప్రతిపాదనలో పేర్కొంది.
మధ్యప్రాచ్య గగనతలంలో ఆంక్షలు ఉండటం, అలాగే పాకిస్థాన్ గగనతలం భారత విమానాలకు మూసివేసి ఉండటంతో విమానాలు అరేబియా సముద్రం మరియు మధ్య ఆసియా మీదుగా సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా ఇంధన వినియోగం కూడా భారంగా మారుతోంది. ఇప్పటికే 11 మధ్యప్రాచ్య దేశాల గగనతలాన్ని హై-రిస్క్ జోన్లుగా డీజీసీఏ ప్రకటించి, వాటిని వాడొద్దని సూచించిన సంగతి తెలిసిందే. ఇరాన్, ఇరాక్ మార్గాలను తప్పించడం వల్ల ఎయిర్ ఇండియాకు చెందిన పలు సుదూర విమానాల 'బ్లాక్ టైమ్' పెరిగిపోవడంతో, నిర్వహణ పరమైన ఇబ్బందుల వల్ల గత వారం కొన్ని విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఇచ్చిన ఈ ప్రతిపాదనను డీజీసీఏ పరిశీలిస్తోంది. అయితే, ఇలాంటి సడలింపుల కోరుతూ ఇండిగో వంటి ఇతర సంస్థల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అభ్యర్థనలు రాలేదని అధికారులు వెల్లడించారు.